Showing posts with label Nandu Writings. Show all posts
Showing posts with label Nandu Writings. Show all posts

రాజంటే??

రాజంటే యుద్దాలు చేయటం
గెలవడమే కాదు
గెలిచిన రాజ్యంప్రజల కోసం 
నిలబడగలగాలి కూడా..!!
చరిత్రలో ఎంతో మంది రాజులున్నారు,
ఎంత గొప్ప రాజైనా 
గర్వం తలకెక్కిన ప్రతిసారి
స్మశాన్నాళ్లో జ్ఞాపకాలుగానే మిగిలిపోయారు
కానీ ప్రజల గుండెల్లో మాత్రం కాదు
ఇది చరిత్ర కాదనలేని సత్యం..!!!
💚దు

ప్రజల కోసం నిలబడే వాడే రాజు ..!!


మన రాజ్యం మనకి కావాలని 
అందరం కలిసి కొట్లాడినం
మన రాజు మనకుండాలని 
మనొడినే రాజుని చేసినం
రాజ్య పాలన పక్కగా 
ఉంటదని సంబురపడ్డం 
మన రాజ్యం మనకొచ్చింది
మన రాజే మనల్ని ఏలుతుండు
పరిపాలనేమో పక్క దారి పట్టింది....

రాజ్యపాలన కాస్త రాజకీయ పాలన అయ్యింది
ఆనాడు ప్రాణాలకి తెగించి కొట్లాడిన 
ఎంతో మంది వీరులు నేడు
నీడ కూడా లేకుండా పోయారు
రాజేమో దర్బార్లోచి బయటికి రాడు.!
సేనాధిపతి, మంత్రులేమో 
చిడతలు వాహించటం మానరు.!!
బంధువులకు, రాబందులకు దోచిపెట్టటానికా 
రాజ్యం కోసం యుద్దాలు, ప్రాణ త్యాగాలు చేసింది ??

రాజంటే యుద్దాలు చేయటం, గెలవడమే కాదు
గెలిచిన రాజ్యం, ప్రజల కోసం నిలబడగలగాలి కూడా..!!
చరిత్రలో ఎంతో మంది రాజులున్నారు,
ఎంత గొప్ప రాజైనా గర్వం తలకెక్కిన ప్రతిసారి
స్మశాన్నాళ్లో జ్ఞాపకాలుగానే మిగిలిపోయారు
 కానీ ప్రజల గుండెల్లో మాత్రం కాదు
ఇది చరిత్ర కాదనలేని సత్యం..!!!
- 💚దు


బ్రతికున్నప్పుడు లేని బంధాలు


బ్రతికున్నప్పుడు ఒకరి మొహం
ఒకరు చూసుకోలేనంతగా బ్రతికి ,
పలకరిస్తే మొహం తిప్పుకుని తిరిగి,
చచ్చాక మాత్రం చివరి చూపులకి 
ఆరాటపడటం ఎందుకు ??

తన ఆత్మ శాంతించదనా ?
లేక నీ అంతరాత్మ సంతృప్తి చెందదనా ??
బ్రతికున్నప్పుడు లేని బంధాలు
చచ్చాక మాత్రం ఎందుకు ??
- ☹️దు

అమ్మలింతే పిచ్చోళ్లు !

అమ్మ:
అమ్మలింతే పిచ్చోళ్లు !
పిల్లలు అల్లరి చేస్తే 
లాగిపెట్టి ఒక్కటిస్తారు
ఏడ్వడం మొదలుపెట్టే లోపే 
దగ్గరకి లాక్కుని లాలిస్తారు.
పిల్లల్ని ప్రేమించటానికి మించిన 
వ్యాపకం మరోకటి ఉండదేమో !!
- 💚దు
01.11.2019.

రియాలిటీ చెక్

రియాలిటీ చెక్:
1.'కొన్నిసార్లు' మనుషులకంటే
వస్తువులకే విలువివ్వాలి !!
ఎందుకంటే
వర్షంలో నువ్వు తడిస్తే వచ్చే
జలుబుకయ్యే ఖర్చుకంటే
నీ కంపెనీ ఇచ్చిన లాప్టాప్ తడిస్తే
అయ్యే ఖర్చే ఎక్కువ.!!

2. చిన్నప్పుడు తమ పిల్లల్ని
శ్రీ కృషుడి వేషాల్లో చూసి
మురిసిపోతారు.!
అదే పెద్దయ్యాక కృషుడి
వేషాలు వేస్తే
తోలు తీస్తారు..!!

-నందు
 

దెబ్బతిన్న శిథిలాలు..!!



దెబ్బతిని మిగిలిపోయిన 
శిథిలాల కింద 
ఏ జీవం ఉండదు, 
కొన్ని జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి
గత చరిత్రను 
గుర్తుచేయటానికి
భావితరాలను 
జాగురూక పరచటానికి
-నందు

నచ్చనితనం !!


నచ్చని మనిషి, 
నచ్చని వస్తువు,
అంటూ దూరం చేసుకుంటు ఉంటే 
ఏదో ఒకరోజు 
మనకు మనమే నచ్చని పరిస్థితి రావొచ్చు !!
అప్పుడేం చేస్తాం ???

అందుకే కుదిరితే
మనుషులతో కలుపుకుని పోవాలి..!
వస్తువులతో సర్దుకుపోవాలి..!!
-నందు

లేని వ్యక్తిత్వం



నువ్వు చస్తే మోయటానికి 
వచ్చే మనుషులు 
నీ వ్యక్తిత్వాన్ని చూసి రావాలి 
కానీ నీ వెనకాల ఉన్న 
డబ్బుని చూసి కాదు 
వ్యక్తిత్వమేలేనప్పుడు 
వందల కోట్లు ఉండి 
కూడా ఎం లాభం ?

-నందు


చేసిన సహాయం


ఈ హనుమ నల్లనివాడే (మా ఊరి దేవుడు )!!



శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, ఊరుకొండపేట గ్రామం 
అతి బలవంతుడూ, అమిత పరాక్రమశాలీ అయిన హనుమంతుడు భక్తులకు కొండంత అండ. ఇక నిండుకాషాయ వర్ణంలో ఉండే సిందూరాలంకరణ ఆ రూపపు ప్రత్యేకత. అయితే ఆ సిందూరపు అలంకరణ ప్రసక్తేలేని ఆలయమూ ఒకటుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా, ఊర్కొండ మండలం, ఊర్కొండపేట గ్రామం ఆ హనుమంతుడి  ఆలయానికి చిరునామా. 




శ్రీరామదూత హనుమంతుడు ప్రభుభక్తికి ప్రతిరూపం. అంతేకాదు, ఆయన్ను తలచుకుంటే చాలు శత్రుభయమేంటి, భూతప్రేత పిశాచాల భయమూ వదిలిపోతుందట. అందుకే చూడగానే ప్రత్యేకంగా కనిపించేలా సిందూరాలంకారంతో కనిపిస్తాడాయన. ఈ అలంకరణ వెనుక రామాయణంలోనూ ఓ కథ ఉంది. కానీ నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట గ్రామ శివారులో గల ఆలయంలోని అభయాంజనేయస్వామి అలంకారం అందుకు భిన్నంగా ఉంటుంది. ఆరడుగుల ఎత్తుతో చక్కటి నల్లరాతి విగ్రహంగా సిందూర రహితంగా దర్శనమిస్తాడు స్వామి. ఆ రూపం వెనుకా ఓ కథ ఉంది.


ఇదీ చరిత్ర... 




సుమారు 400 ఏళ్లక్రితం హైదరాబాద్‌ నగరం నిర్మాణ సమయంలో అప్పటి నైజాం నవాబులు కృష్ణా తీరంలోని భోజరాయపల్లి అనే గ్రామంలో నివసించే భోజరాయలు, సింగరాయలు, బ్రహ్మరాయలు అనే ముగ్గురు అన్నదమ్ములను పిలిపించి వారితో హైదరాబాద్‌ నగరంలోని పత్తర్‌ఘట్టి తదితర ప్రాంతాల్లో వివిధ భవనాలూ, రాజమందిరాలను నిర్మింపజేశారు. అవన్నీ అందంగా రావడంతో, వారి కళను మెచ్చి నైజాం నవాబులు 10 వేల ఎకరాల భూమిని కేటాయించారట. భోజరాయపల్లికి అతి సమీపంలో అమ్మపల్లి అనే గ్రామం ఉండేది. ఈ రెండు గ్రామాల ప్రజల మధ్య ఓ విషయమై గొడవ జరిగి రెండు వూళ్లనూ తగలబెట్టుకొన్నారట. ఈ సంఘటన తర్వాత భోజరాయపల్లి గ్రామంలో నివసించడం మంచిదికాదని భావించిన భోజరాయలు ఆ గ్రామాన్ని ఖాళీ చేయించి గ్రామ శివారులో నిజాములు ఇచ్చిన స్థలంలో గుట్టల మధ్య ఇప్ప చెట్లలో నూతన గ్రామాన్ని నిర్మించారు. దాన్నే ప్రస్తుతం గట్టుఇప్పలపల్లి గ్రామంగా పిలుస్తున్నారు. భోజరాయలు శివోపాసకుడు కావడంతో గట్టుఇప్పలపల్లి గ్రామంలో కాళికాదేవితో పాటు పంచలింగాలనూ, ఆంజనేయస్వామినీ ప్రతిష్ఠించాలని భావించారట. ఆంజనేయస్వామి విగ్రహానికి అవసరమయ్యే శిల కోసం వెతుకుతూ అక్కడికి దగ్గర్లోని వూర్కొండపేట గ్రామందాకా వచ్చారట. అక్కడి శివారులోని గుట్టపై శిలను గుర్తించి ప్రతిమను చెక్కించి తరలిస్తూ రాత్రి కావడంతో అదే వూర్లోని ఓ చెట్టుకింద భోజరాయలు నిద్రపోయారట. అప్పుడే స్వామి కలలో కనిపించి తనను ఇక్కడే ప్రతిష్ఠింపజేయాలనీ, విగ్రహానికి సిందూరాన్ని పూయవద్దనీ ఆదేశించారట. దీంతో భోజరాయలు అక్కడే ఆంజనేయస్వామిని ప్రతిష్ఠించి ఆలయాన్ని కట్టించారనేది ఆలయ చరిత్ర. ఆ ఆదేశంతోనే అప్పటి నుంచి విగ్రహాన్ని సిందూర లేపనం లేకుండా పూజిస్తుంటారని పూర్వీకులు చెబుతారు. ఇక్కడి ఆంజనేయస్వామికి రోజూ తిలతైలాభిషేకం నిర్వహించడం ఓ ప్రత్యేకత.




ఉత్సవం...


అభయాంజనేయుడికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేవాలయ ప్రాంగణంలో ఆ రోజు సత్యనారాయణ వ్రతాలూ జరుగుతాయి. ప్రతి శనివారం కనీసం 5వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. శ్రీ ఆంజనేయ స్వామికి ఏటా పుష్య బహుళ ఏకాదశి నుంచి మాఘ శుద్ధ చవితి వరకూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా రథోత్సవంతో పాటూ శకటోత్సవం నిర్వహిస్తారు. అంటే, ఆ రోజు చుట్టుపక్కల వూళ్లరైతులంతా తమ ఎడ్లబండ్లని రంగుల కాగితాలతో ముస్తాబు చేసుకుని వాటి మీద వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దేవాలయ ప్రాంగణంలో శివాలయమూ ఉంది. అక్కడ నలభై అడుగుల ఎత్తుతో నిర్మించిన శంకరుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయానికి ఏటా అరవై లక్షల రూపాయలదాకా ఆదాయం వస్తుంది. ప్రతి శనివారం వచ్చే భక్తులకు అన్నదాన సౌకర్యం కలదు










బాధా విముక్తికి... 



అనారోగ్యంతో ఉన్నవాళ్లూ, సంతానం లేని వాళ్లూ, గ్రహదోషాలూ, మానసిక రుగ్మతలున్నవాళ్లూ, మానసిక ప్రశాంతత లోపించిన వాళ్లూ ఇక్కడి స్వామివారిని పూజిస్తే బాధా విముక్తులవుతారని భక్తుల నమ్మకం. ఏడాదంతా నీరుండే ఇక్కడి కోనేరులో 11, 21, 41 రోజుల పాటు స్నానమాచరించి ఆలయ ప్రదక్షిణలు చేస్తే అనుకున్నవి నెరవేరతాయట. అభయుడిని ప్రతిష్ఠించిన రోజు నుంచి ఇప్పటి వరకూ నిత్యం రాత్రివేళల్లో కనీసం 30 మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తుండటం ఈ నమ్మకానికి ప్రతీక. ఇక్కడ భక్తులు ఉండేందుకు సత్రాలూ, వసతి గృహాలూ అందుబాటులో ఉన్నాయి.





ఇలా వెళ్లొచ్చు... 

1.కల్వకుర్తి నుండి ఊరుకొండపేటకి దూరం 12 కిలోమీటర్లు, ఈ గ్రామానికి ప్రతిరోజు రాత్రి దేవాలయం వరకు వచ్చే ఆర్టిసి బస్సుతోపాటు చాలా ఆటోల సౌకర్యం కలదు, నేరుగా వచ్చే వాహనాలతో పాటు ఊర్కొండ మీదుగా వచ్చే వాహనాలో కూడా ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చును.

2.మహబూబ్‌నగర్‌ కల్వకుర్తి ప్రధాన రహదారిలో ఊర్కొండ గ్రామ స్టేజీ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఊర్కొండకు మహబూబ్‌ నగర్‌ నుంచి అయితే 50 కి.మీ., నాగర్‌ కర్నూల్‌ నుంచి 44 కి.మీ దూరం ఉండగా, హైదరాబాద్‌ నుంచి 93 కిలోమీటర్లు ప్రయాణించి ఆలయాన్ని చేరుకోవచ్చు.

3. i . హైదరాబాద్ సంతోష్ నగర్ నుండి ప్రతి రోజు పొద్దున్న 9:30 - 10:00 సమయంలో ఊరుకొండపేట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. 
ii.   హైదరాబాద్ అఫ్జల్ గంజ్ నుండి కూడా కొత్తగా TSRTC  వారు బస్సు సౌకర్యం కల్పించటం హర్షించదగ్గ విషయం


ఈ రెండు బస్సులు ఉరుకొండపేట మీదుగా గుడి వరకు వెళ్లి అక్కడి నుండి ఉర్కొండ గేట్ వరకు వెళ్లి మళ్ళి తిరిగి  హైదరాబాద్ కి వెళ్లేలా సదుపాయం కల్పించారు.