స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

ఒకప్పుడు మనం స్కూల్లో కాలేజీల్లో ఫ్రెండ్స్ని చేస్కునే వాళ్ళం, 
ఇప్పుడిలా ఫేస్బుక్ లో చేసుకుంటున్నాం..
ఎన్నో విషయాల్ని మిత్రులతో షేర్ చేస్కునే వాళ్ళం,
ఇప్పుడిలా ఫేసుబుక్లో, ఇంస్టాగ్రామ్లో షేర్ చేస్తున్నాం..
ఫ్రెండ్స్తో ఫోటోలు దిగి భద్రంగా దాచుకునే వాళ్ళం,
ఇప్పుడిలా ఫోటోలు పెట్టి ట్యాగ్గింగ్ చేస్తున్నాం...
ఫ్రెండ్షిప్స్ బ్యాండ్స్ కట్టి ఒకరినోకోరం విష్ చేసుకునే వాళ్ళం,
ఇప్పుడిలా స్టేటస్ లు పెట్టి పలకరించుకుంటున్నాం...

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే 
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

-నందు.

బంధాలు



జీవితంలో బంధాలను ఏర్పరచుకోవడం, 
వదులుకోవడం అనేది 
ఫెసుబుక్లో ఆడ్ ఫ్రెండ్ /అన్ ఫ్రెండ్ చేసినంత సులువుకాదు...

ఒకసారి Unfriend చేస్తే 
మళ్ళీ add req పెట్టే అవకాశం ఉంటుంది.
కానీ జీవితంలో మళ్ళి ఆ బంధం బలపడాలంటే 
కొన్ని వందల మెట్లు దిగిరావాలి, 
వేల మైళ్ళు వెనక్కి నడవాలి...!!
-నందు.



గుణాత్మక మార్పు


గీ హైదరాబాద్ రోడ్ల కింద లంకే బిందెలు ఉన్నావా ఏందీ  ?
లేక బంగారు తెలంగాణ జేయనీకే బంగారం కోసం తొవ్వుతున్నారా ఊకె ??

వారం కిందనే సంతోష్ నగర్ నుండి సైదాబాద్, చంచల్ గూడ జైలు వరకు
మంచిగా  రోడ్డు ఏశిన్రు అనుకుంటుంటే 
మళ్ల తెల్లారే  తొవ్వుడు షురూ జేశిన్రు...

గీ ఏసుడు మల్ల తొవ్వుడు,మల్లేసుడు మల్ల తొవ్వుడు  ఏందీ ఈ పంచాతి ?
సారు ముందే అన్ని తవ్వకాలయిపోయినాక ఎస్తే కాద ?
లేక  కాంట్రాక్టర్లకు ఉపాధి హామీ పని దొరకదు  అనుకున్నరా ఏందీ ?

రెండు ప్రభుత్వ శాఖల మధ్యనే సమన్వయం లేదు,
రెండు మూడు రాష్త్రాల మధ్య సమన్వయం ఎట్లొస్తది ?

దేశంల గుణాత్మక మార్పు యాడొస్తది ??

-నందు 

ఈ హనుమ నల్లనివాడే (మా ఊరి దేవుడు )!!



శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, ఊరుకొండపేట గ్రామం 
అతి బలవంతుడూ, అమిత పరాక్రమశాలీ అయిన హనుమంతుడు భక్తులకు కొండంత అండ. ఇక నిండుకాషాయ వర్ణంలో ఉండే సిందూరాలంకరణ ఆ రూపపు ప్రత్యేకత. అయితే ఆ సిందూరపు అలంకరణ ప్రసక్తేలేని ఆలయమూ ఒకటుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా, ఊర్కొండ మండలం, ఊర్కొండపేట గ్రామం ఆ హనుమంతుడి  ఆలయానికి చిరునామా. 




శ్రీరామదూత హనుమంతుడు ప్రభుభక్తికి ప్రతిరూపం. అంతేకాదు, ఆయన్ను తలచుకుంటే చాలు శత్రుభయమేంటి, భూతప్రేత పిశాచాల భయమూ వదిలిపోతుందట. అందుకే చూడగానే ప్రత్యేకంగా కనిపించేలా సిందూరాలంకారంతో కనిపిస్తాడాయన. ఈ అలంకరణ వెనుక రామాయణంలోనూ ఓ కథ ఉంది. కానీ నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట గ్రామ శివారులో గల ఆలయంలోని అభయాంజనేయస్వామి అలంకారం అందుకు భిన్నంగా ఉంటుంది. ఆరడుగుల ఎత్తుతో చక్కటి నల్లరాతి విగ్రహంగా సిందూర రహితంగా దర్శనమిస్తాడు స్వామి. ఆ రూపం వెనుకా ఓ కథ ఉంది.


ఇదీ చరిత్ర... 




సుమారు 400 ఏళ్లక్రితం హైదరాబాద్‌ నగరం నిర్మాణ సమయంలో అప్పటి నైజాం నవాబులు కృష్ణా తీరంలోని భోజరాయపల్లి అనే గ్రామంలో నివసించే భోజరాయలు, సింగరాయలు, బ్రహ్మరాయలు అనే ముగ్గురు అన్నదమ్ములను పిలిపించి వారితో హైదరాబాద్‌ నగరంలోని పత్తర్‌ఘట్టి తదితర ప్రాంతాల్లో వివిధ భవనాలూ, రాజమందిరాలను నిర్మింపజేశారు. అవన్నీ అందంగా రావడంతో, వారి కళను మెచ్చి నైజాం నవాబులు 10 వేల ఎకరాల భూమిని కేటాయించారట. భోజరాయపల్లికి అతి సమీపంలో అమ్మపల్లి అనే గ్రామం ఉండేది. ఈ రెండు గ్రామాల ప్రజల మధ్య ఓ విషయమై గొడవ జరిగి రెండు వూళ్లనూ తగలబెట్టుకొన్నారట. ఈ సంఘటన తర్వాత భోజరాయపల్లి గ్రామంలో నివసించడం మంచిదికాదని భావించిన భోజరాయలు ఆ గ్రామాన్ని ఖాళీ చేయించి గ్రామ శివారులో నిజాములు ఇచ్చిన స్థలంలో గుట్టల మధ్య ఇప్ప చెట్లలో నూతన గ్రామాన్ని నిర్మించారు. దాన్నే ప్రస్తుతం గట్టుఇప్పలపల్లి గ్రామంగా పిలుస్తున్నారు. భోజరాయలు శివోపాసకుడు కావడంతో గట్టుఇప్పలపల్లి గ్రామంలో కాళికాదేవితో పాటు పంచలింగాలనూ, ఆంజనేయస్వామినీ ప్రతిష్ఠించాలని భావించారట. ఆంజనేయస్వామి విగ్రహానికి అవసరమయ్యే శిల కోసం వెతుకుతూ అక్కడికి దగ్గర్లోని వూర్కొండపేట గ్రామందాకా వచ్చారట. అక్కడి శివారులోని గుట్టపై శిలను గుర్తించి ప్రతిమను చెక్కించి తరలిస్తూ రాత్రి కావడంతో అదే వూర్లోని ఓ చెట్టుకింద భోజరాయలు నిద్రపోయారట. అప్పుడే స్వామి కలలో కనిపించి తనను ఇక్కడే ప్రతిష్ఠింపజేయాలనీ, విగ్రహానికి సిందూరాన్ని పూయవద్దనీ ఆదేశించారట. దీంతో భోజరాయలు అక్కడే ఆంజనేయస్వామిని ప్రతిష్ఠించి ఆలయాన్ని కట్టించారనేది ఆలయ చరిత్ర. ఆ ఆదేశంతోనే అప్పటి నుంచి విగ్రహాన్ని సిందూర లేపనం లేకుండా పూజిస్తుంటారని పూర్వీకులు చెబుతారు. ఇక్కడి ఆంజనేయస్వామికి రోజూ తిలతైలాభిషేకం నిర్వహించడం ఓ ప్రత్యేకత.




ఉత్సవం...


అభయాంజనేయుడికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేవాలయ ప్రాంగణంలో ఆ రోజు సత్యనారాయణ వ్రతాలూ జరుగుతాయి. ప్రతి శనివారం కనీసం 5వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. శ్రీ ఆంజనేయ స్వామికి ఏటా పుష్య బహుళ ఏకాదశి నుంచి మాఘ శుద్ధ చవితి వరకూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా రథోత్సవంతో పాటూ శకటోత్సవం నిర్వహిస్తారు. అంటే, ఆ రోజు చుట్టుపక్కల వూళ్లరైతులంతా తమ ఎడ్లబండ్లని రంగుల కాగితాలతో ముస్తాబు చేసుకుని వాటి మీద వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దేవాలయ ప్రాంగణంలో శివాలయమూ ఉంది. అక్కడ నలభై అడుగుల ఎత్తుతో నిర్మించిన శంకరుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయానికి ఏటా అరవై లక్షల రూపాయలదాకా ఆదాయం వస్తుంది. ప్రతి శనివారం వచ్చే భక్తులకు అన్నదాన సౌకర్యం కలదు










బాధా విముక్తికి... 



అనారోగ్యంతో ఉన్నవాళ్లూ, సంతానం లేని వాళ్లూ, గ్రహదోషాలూ, మానసిక రుగ్మతలున్నవాళ్లూ, మానసిక ప్రశాంతత లోపించిన వాళ్లూ ఇక్కడి స్వామివారిని పూజిస్తే బాధా విముక్తులవుతారని భక్తుల నమ్మకం. ఏడాదంతా నీరుండే ఇక్కడి కోనేరులో 11, 21, 41 రోజుల పాటు స్నానమాచరించి ఆలయ ప్రదక్షిణలు చేస్తే అనుకున్నవి నెరవేరతాయట. అభయుడిని ప్రతిష్ఠించిన రోజు నుంచి ఇప్పటి వరకూ నిత్యం రాత్రివేళల్లో కనీసం 30 మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తుండటం ఈ నమ్మకానికి ప్రతీక. ఇక్కడ భక్తులు ఉండేందుకు సత్రాలూ, వసతి గృహాలూ అందుబాటులో ఉన్నాయి.





ఇలా వెళ్లొచ్చు... 

1.కల్వకుర్తి నుండి ఊరుకొండపేటకి దూరం 12 కిలోమీటర్లు, ఈ గ్రామానికి ప్రతిరోజు రాత్రి దేవాలయం వరకు వచ్చే ఆర్టిసి బస్సుతోపాటు చాలా ఆటోల సౌకర్యం కలదు, నేరుగా వచ్చే వాహనాలతో పాటు ఊర్కొండ మీదుగా వచ్చే వాహనాలో కూడా ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చును.

2.మహబూబ్‌నగర్‌ కల్వకుర్తి ప్రధాన రహదారిలో ఊర్కొండ గ్రామ స్టేజీ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఊర్కొండకు మహబూబ్‌ నగర్‌ నుంచి అయితే 50 కి.మీ., నాగర్‌ కర్నూల్‌ నుంచి 44 కి.మీ దూరం ఉండగా, హైదరాబాద్‌ నుంచి 93 కిలోమీటర్లు ప్రయాణించి ఆలయాన్ని చేరుకోవచ్చు.

3. i . హైదరాబాద్ సంతోష్ నగర్ నుండి ప్రతి రోజు పొద్దున్న 9:30 - 10:00 సమయంలో ఊరుకొండపేట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. 
ii.   హైదరాబాద్ అఫ్జల్ గంజ్ నుండి కూడా కొత్తగా TSRTC  వారు బస్సు సౌకర్యం కల్పించటం హర్షించదగ్గ విషయం


ఈ రెండు బస్సులు ఉరుకొండపేట మీదుగా గుడి వరకు వెళ్లి అక్కడి నుండి ఉర్కొండ గేట్ వరకు వెళ్లి మళ్ళి తిరిగి  హైదరాబాద్ కి వెళ్లేలా సదుపాయం కల్పించారు. 



చితికిన బాల్యం

 మూడింటికో బడైపోతే
దోస్తులతో పెద్దబడి కాడికి పోయి ,
 గ్రౌండ్లో  పెద్ద బడి పిల్లలు కిరికెట్తో
కబడ్డో ఆడుతావుంటే 
వాటిని సూత్తూ  సూత్తూ,
మన తోటి పిల్లలతో  పతంగొ,గోళీలాటో
ఎదో ఒకాట ఆడుతూ రాత్రి ఆరింటికో ఏడింటికో  
ఇంటికెళ్లి అమ్మ పెట్టు చివాట్లు
గోరుముద్దలు తిని నిద్రపోతాం 
ఒకపూట బళ్ళు మొదలైనప్పటి నుండి 
ఎండకాలం పోయే దాకా 
మన ఊరి చెరువులోనోబావుల్లోనో
మనింట్లో నాన్నానోఅన్నానో తీసుకెళ్లి,
మన దోస్తులని వెంటేసుకెళ్ళి మరీ 
ఈత నేర్చుకుంటాం..
సెలవుల్లో అమ్మమ్మ ఊరికి వెళ్లినపుడు
తాత ఎంతో ప్రేమతో చేయించిన/చేసిన చక్రాల బండిని 
మనింటికి తీసుకువచ్చి 
దానితో ఆడుకుంటూ సంబరపడి పోతాం
పది దాక మనవూళ్ళోనే సదువుకుని 
పెద్ద సదువుకోసం 
పట్నంలోపక్కూరో వెళ్ళేదాకా 
మన బాల్యాన్ని ఆస్వాదించాం
కానీ,
 కాలం పిల్లలు 
రెండేళ్ళకి సెల్ల్ఫోనకి అలవాటు పడి
మూడేళ్లకే బడికిపోయి,
ఆటలంటే  టెంపుల్ రన్నో ,
కాండీక్రస్షో అనుకుంటూ
మొబైల్ యాప్లలో ఆటలాడుకుంటూ 
ఇవే ఔట్డోర్ గేమ్స్ అనుకుంటున్నారు
భవిష్యత్ అనే భూతానికి బయపడి
తల్లి దండ్రులు కూడా ర్యాంకులు
చదువులు అంటూ బాల్యాన్ని 
బందిఖానాలో పడేస్తున్నారు.!!
-నందు

ప్రేమకి మరోవైపు...!!




ప్రేమలో పడిన కొత్తలో ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి గురించి 
 నువ్వు ఎంత ఆరాట పడుతావో,
నీకు దూరంగా ఉన్న నీ తల్లిదండ్రులు కూడా 
అంతే ఆరాటపడతారు....
ఆ వ్యక్తి మీద మొదట్లో ఉన్నంత  ఆరాటం 
ఇప్పుడు నీకుండకపోవచ్చు
కానీ నీ తల్లిదండ్రుల ఆరాటం 
బ్రతికి ఉన్నంత కాలం ఉంటుంది....
అదే ప్రేమంటే....!!
-నందు